డోలీ మోతకు చెక్

విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లాలో సగభాగం ఏజెన్సీ ప్రాంతమే. జిల్లాలో పాడేరు ఐటీడీఏ పరిధిలో 11 గిరిజన మండలాల్లో 245 పంచాయతీలు, వాటిలో 4,210 గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ మారుమూల గిరిజన గ్రామాలే. చాలా గ్రామాలు కొండల్లో ఎక్కడెక్కడో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో సౌకర్యాలు ఉండవు. మరికొన్ని గ్రామాల్లో మార్గమే లేని పరిస్థితి. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ బ్రతుకుతున్నారు అమాయక గిరిజన ప్రజలు. ఈ గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఎక్కువ. చెప్పాలంటే కొన్ని కొన్ని గ్రామాల్లో పాఠశాల సదుపాయం కూడా లేదు. కొన్ని గ్రామాల్లో ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రికి వెళ్ళాలన్నా, బాలింతలను తీసుకుని వెళ్ళాలన్నా డోలీ కట్టి మోసుకుని వెళ్ళాల్సిందే. ఈ  డోలీలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటువంటి గ్రామాల్లో నివశించే గిరిజన ప్రజల చిరకాల వాంఛ "రోడ్డు". 


అనేక సార్లు ఎన్నో గ్రామాల గిరిజన ప్రజలు అధికారులను, ప్రజా ప్రతినిధులను మా గ్రామానికి దారి చూపండి అంటూ రోడ్డు కావాలని అడిగారు, వినతి పత్రాలు సమర్పించారు. ఇప్పటికీ అడుగుతున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు. ఎన్ని సార్లు ఎవరి దగ్గర మొర పెట్టుకున్నా, ఎవ్వరూ పట్టించుకోలేదు. దానితో విసిగిపోయిన కొన్ని గ్రామాల ప్రజలు స్వయం గా రోడ్డు నిర్మించుకున్నారు. దానిలో కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ లో గంగవరం గ్రామం ఒకటి.గంగవరం కొమ్మికను ఆనుకొని ఉన్న చిన్న గ్రామం. ఇక్కడ ప్రజలు ఏ చిన్న అవసరం వచ్చినా, సరుకులు కావాలన్నా కొమ్మిక నడిచి వెళ్ళాల్సిందే. గంగవరం వెళ్ళాలంటే, 3 కిలో మీటర్ల కొండ ఎక్కాలి. ఎన్నో సంవత్సరాలుగా వారి కష్టాలు గురించి మొరపెట్టుకున్న ప్రజలు, ఎవ్వరూ పట్టించుకోకపోవడం తో విరాళాలు వేసుకుని వారి గ్రామానికి రోడ్డు నిర్మించుకున్నారు. ప్రస్తుతం గంగవరం గ్రామానికి ద్విచక్ర వాహనాలు, ఆటోలు తిరుగుతున్నాయి. కానీ, రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉందని ప్రయాణీకులు చెబుతున్నారు. 


ఇటువంటి పరిస్థితుల్లోని మరో గ్రామం బోనూరు ఇది అనంతగిరి మండలంలో ఉంది. ఇక్కడ ప్రజలు, చదువుకున్న కొందరు యువకులు చేయి చేయి కలిపి స్వయంగా రోడ్డు వేసుకున్నారు. ఇంటికి ఒక్కరు చొప్పున ప్రతి రోజూ పని చేసి రోడ్డు నిర్మించుకున్నారు. దాదాపుగా రోజుకి 300 మంది రోడ్డు కోసం కష్టపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన గ్రామాలకు మార్గం చూపాలని, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎన్నో గ్రామాలు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. 9 నెలల ప్రభుత్వం అయినా గిరిజన ప్రజల మొర ఆలకిస్తుందేమో చూడాలి.



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఘనంగా గణతంత్ర దినోత్సవం

కాలం రాబోతోంది...